ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు!
- ఎర్రవల్లిలో కేసీఆర్తో భేటీ అయిన మాజీ మంత్రి హరీశ్ రావు
- కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
- 15 రోజుల్లో విచారణకు రావాలని కమిషన్ ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత, నిర్మాణంలో లోపాలు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లోతుగా విచారణ జరుపుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ ప్రభుత్వంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వీరికి కమిషన్ నోటీసులు జారీ చేసింది.