భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా అంటే.. చైనా ఏం చెప్పిందంటే?

  • ఆపరేషన్ సింధూర్‌పై చైనా నుంచి అధికారిక స్పందన
  • భారత్-పాక్ ఉద్రిక్తతల్లో తమది తటస్థ వైఖరి అన్న డ్రాగన్
  • కాల్పుల విరమణ ఒప్పందానికి చైనా మద్దతు
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' అనంతరం, ఆ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక సాయం అందించిందా అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా తలెత్తాయి. ఈ ఊహాగానాలపై చైనా విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఇస్లామాబాద్‌కు బీజింగ్ సైనికపరంగా అండగా నిలిచిందా అన్న మీడియా ప్రశ్నలకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ సమాధానమిచ్చారు.

"భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చైనా తటస్థంగానే వ్యవహరించింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని మేం కోరాం. ఇరుపక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మా పూర్తి మద్దతు ఉంది. శాశ్వత కాల్పుల విరమణను ప్రోత్సహించడంలో, అలాగే ప్రాంతీయ సుస్థిరత కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం" అని వెల్లడించారు.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పీఓకేతో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. తమ వద్ద చైనా నుంచి సమకూర్చుకున్న హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయని, భారత వైమానిక దాడులు, క్షిపణి దాడులను అవి సమర్థవంతంగా అడ్డుకుంటాయని పాకిస్థాన్ భావించింది. అయితే, ఆపరేషన్ సింధూర్‌లో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని కూడా ఈ చైనా వ్యవస్థలు, వాటి రాడార్లు నిలువరించలేకపోయాయి.


More Telugu News