సహనం కోల్పోయిన కుల్దీప్ యాదవ్.. డీఆర్ఎస్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో!

  • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై కుల్దీప్ ఆగ్రహం
  • సాయి సుదర్శన్‌ను నాటౌట్‌గా ప్రకటించడంపై కుల్దీప్ అసహనం
  •  నాలుగు ఓవర్ల వేసి వికెట్ తీయకుండా 37 పరుగులు ఇచ్చుకున్న కుల్దీప్ 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తాను వేసిన తొలి బంతికే లభించాల్సిన వికెట్ అంపైర్ నిర్ణయంతో చేజారిపోవడంతో మైదానంలోనే కోపంతో ఊగిపోయాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ అజేయ సెంచరీతో చెలరేగి జట్టుకు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు.

 అసలేం జరిగిందంటే? 
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేయడానికి కుల్దీప్ యాదవ్ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ తొలి బంతికే గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ఎల్బీ చేశానని కుల్దీప్ భావించాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ కేల్కర్ దానిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ వెంటనే డీఆర్‌ఎస్ కోరాడు. రివ్యూలో బంతి ఇంపాక్ట్ 'అంపైర్స్ కాల్'గా తేలడంతో థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబడ్డాడు.

ఈ నిర్ణయాన్ని పెద్ద స్క్రీన్‌పై చూడగానే కుల్దీప్ యాదవ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో ముఖం ఎర్రబడగా అంపైర్ కేల్కర్‌తో వాగ్వాదానికి దిగాడు. సహచర ఆటగాళ్లు, కెప్టెన్ అక్షర్ పటేల్ జోక్యం చేసుకుని అతడిని శాంతింపజేశారు. 


More Telugu News