పాక్ వక్రబుద్ధి... గుజరాత్ లో మళ్లీ డ్రోన్ దాడులు?... పంజాబ్ లో మోగుతున్న సైరన్లు

  •  కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ కవ్వింపు చర్యలు!
  • శ్రీనగర్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
  • గుజరాత్ లో పరిస్థితి వెల్లడించిన రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి
కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌తో పాటు పలు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పలు భారత భూభాగాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, ఉధంపుర్‌లలో భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సైతం పేర్కొన్నారు. 

పాకిస్థాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొని, ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌తో పాటు శ్రీనగర్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయం సమీపంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.

ఈ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో ముందు జాగ్రత్త చర్యగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో కూడా బ్లాక్‌అవుట్‌ పాటించడంతో పాటు, జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. పంజాబ్‌లోని మోగాలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

పాకిస్థాన్ డ్రోన్ల దాడుల ప్రభావం గుజరాత్‌పైనా పడినట్లు తెలుస్తోంది. కచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పూర్తి బ్లాక్‌అవుట్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని ఆయన 'ఎక్స్' ద్వారా విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.


More Telugu News