పాక్ తో ఉద్రిక్తతలు... తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రత్యేక రైళ్లు నడపాలని కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు
- భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన
- ఉత్తరాది రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి వినతి
- జలంధర్, జమ్మూ, కురుక్షేత్ర, చండీగఢ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు కోరిన ఎంపీ
హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు విద్యాసంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా జలంధర్, జమ్మూ, కురుక్షేత్రల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్లతో పాటు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు అధికంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఈ విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ, చండీగఢ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.