వారి ధైర్యసాహసాలకు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం: విరాట్ కోహ్లీ

  • సరిహద్దుల్లో తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు
  • వాయిదా పడిన ఐపీఎల్
  • భారత సైన్యానికి మద్దతు పలికిన భారత స్టార్ క్రికెటర్లు
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నియంత్రణ రేఖ వెంబడి, పలు సరిహద్దు భారతీయ నగరాల్లో క్షిపణి దాడులు, వైమానిక దాడుల హెచ్చరికలు, సైనిక బలగాల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టోర్నమెంట్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో, భారత స్టార్ క్రికెటర్లు సైన్యం సేవలను కొనియాడారు.

దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న భారత సాయుధ దళాలకు వందనం చేస్తున్నట్లు విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. "మన గొప్ప దేశం కోసం మన హీరోలు, వారి కుటుంబాలు చేస్తున్న త్యాగాలకు, వారి అచంచలమైన ధైర్యసాహసాలకు మేమెప్పటికీ రుణపడి ఉంటాం" అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చారు. 

భారత జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సైన్యానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. "మనల్ని సురక్షితంగా ఉంచడానికి వారు చేస్తున్న అన్నింటికీ మేము వారికి వందనం చేస్తున్నాం. వారి ధైర్యసాహసాలకు కృతజ్ఞతలు. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం," అని బుమ్రా 'ఎక్స్ వేదికగా తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ కూడా, "మన సైనిక బలగాల దృఢ సంకల్పం పట్ల ఎంతో గర్వంగా ఉంది. మీరు సరిహద్దుల్లో మమ్మల్ని కాపాడటంలో చూపించే బలం, దృఢ నిశ్చయానికి పెద్ద సెల్యూట్. మీ వల్లే మేము ఇళ్లలో సురక్షితంగా ఉంటున్నాం. మీకు ధన్యవాదాలు. జై హింద్" అని  పోస్ట్ చేశారు.

అంతకుముందు, భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం పట్ల గర్వంగా ఉందని, ప్రజలు నకిలీ వార్తలను ప్రచారం చేయకుండా దేశానికి మద్దతుగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.



More Telugu News