భారత్-పాక్ ఉద్రిక్తతలు... పౌరులకు దర్శకుడు రాజమౌళి కీలక విజ్ఞప్తి

  • భారత సైనిక కదలికలను చిత్రీకరించవద్దని సూచన
  • సోషల్ మీడియాలో ఆర్మీ సమాచారం పంచుకోవద్దన్న రాజమౌళి
  • నిర్ధారించని వార్తలను ఫార్వార్డ్ చేయవద్దని హితవు
  • ప్రశాంతంగా, అప్రమత్తంగా, సానుకూలంగా ఉండాలని సూచన
  • విజయం మనదేనంటూ ట్వీట్
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దేశ పౌరులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత సైనిక దళాల కదలికలు ఎక్కడైనా గమనిస్తే, వాటిని ఫోటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం చేయవద్దని స్పష్టం చేశారు. అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనకు తెలియకుండానే శత్రువులకు సహాయం చేసినవారమవుతామని ఆయన హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వార్త లేదా సమాచారం కనిపిస్తే, దానిని గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు. ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయడం వల్ల అనవసరమైన గందరగోళం, ఆందోళన చెలరేగుతాయని, శత్రువులు కూడా ఇదే కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని రాజమౌళి పిలుపునిచ్చారు. అంతిమంగా విజయం మనదే అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "శాంతంగా, అప్రమత్తంగా మరియు సానుకూలంగా ఉండండి. విజయం మనదే" అని రాజమౌళి తన సందేశంలో పేర్కొన్నారు.

'ఉగ్రవాదం నుంచి మన దేశాన్ని రక్షించడంలో అచంచల ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న మన వీర భారత సాయుధ దళాలకు వందనం. వారి పరాక్రమానికి ప్రేరణ పొంది, శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి ఒక దేశంగా కలిసి నిలబడదాం' అని ఆయన మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.


More Telugu News