ఆపరేషన్ సింధూర్: భారత సైన్యానికి క్రికెటర్ల జేజేలు

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు, ప్రస్తుత ఆటగాళ్లు సైన్యానికి మద్దతుగా నిలిచి 'జై హింద్' అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా ఈ సైనిక చర్యను చేపట్టారు. మే 6న అర్ధరాత్రి దాటిన తర్వాత, తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.  

మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, ప్రజ్ఞా ఓఝా తదితరులు భారత సాయుధ బలగాలను బహిరంగంగా ప్రశంసించిన వారిలో ముందున్నారు. వీరంతా సోషల్ మీడియాలో దేశభక్తి సందేశాలను 'జై హింద్' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. వీరితో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా సైన్యానికి మద్దతు పలికాడు. ఆపరేషన్‌కు సంబంధించిన అధికారిక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు.

ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా బలమైన జాతీయవాద భావోద్వేగాలను రేకెత్తించింది. #OperationSindoor, #JaiHind, #IndianArmy వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పౌరులు సైతం సాయుధ బలగాల ధైర్యసాహసాలను కొనియాడుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

Operation Sindoor
Indian Army
Gautam Gambhir
Akash Chopra
Pragyan Ojha
Varun Chakravarthy
Pakistan
POK
Terrorist Camps
Jai Hind

More Telugu News