Joju George: సీక్వెల్ ఖాయం చేసిన సీనియర్ స్టార్ హీరో!

- మలయాళంలో హిట్ కొట్టిన 'పని'
- 40 కోట్లకి పైగా వసూళ్లు
- సీక్వెల్ రెడీ చేస్తున్న జోజు జార్జ్
- డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు
మలయాళ సినిమాలను ఫాలో అయ్యేవారికి జోజు జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తనకంటూ అక్కడ ఒక ఫాలోయింగ్ ఉంది. ఇంతవరకూ నటుడిగా మాత్రమే వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ఆయన, 'పని' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు ఆయనే కథను సిద్ధం చేసుకోవడం మరో విశేషం. క్రితం ఏడాది విజయాన్ని సాధించిన సినిమాల జాబితాలో ఇది ఒకటి.
జోజు జార్జ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, మొదటి నుంచి చివరివరకూ కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా, 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా జోజు జార్జ్ చెప్పారు. ఈ సీక్వెల్ కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయనీ, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.
'పని' పార్టు 1 సినిమా, క్రితం ఏడాది అక్టోబర్ 24న విడుదలైంది. కథానాయకుడు ఒక గ్యాంగ్ స్టర్. ఆయనకి ఎదురుపడటానికే ఆ ప్రాంతంలోని వాళ్లు భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇద్దరు పోకిరీలు ఆయన భార్యపై అత్యాచారం చేస్తారు. ఆయన అనుచరులు సైతం భయపడేలా చేస్తారు. అప్పుడు ఆ గ్యాంగ్ స్టర్ ఏం చేస్తాడు? అనేది కథ. అయితే ఈ కథతో సంబంధం లేకుండా సీక్వెల్ నడుస్తుందట.