వీడెవడండీ బాబూ.. భార్య ముక్కు అందంగా ఉంద‌ని ఎంత ప‌నిచేశాడో..!

  • బెంగాల్‌లోని న‌దియా జిల్లాలో ఘ‌ట‌న‌
  • భార్య ముక్కు అందంగా ఉంద‌ని కొరుక్కుతిన్న భ‌ర్త‌
  • బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన దారుణం
ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణం జ‌రిగింది. భార్య ముక్కు అందంగా ఉంద‌ని కొరుక్కుతిన్నాడో భ‌ర్త‌. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న బెంగాల్‌లోని న‌దియా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... శాంతీపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బేర్పారా ప్రాంతంలో బాప‌న్ షేక్‌, మ‌ధు ఖాతూన్ దంప‌తులు నివాసం ఉంటున్నారు. 

అయితే, ఈ నెల 2న తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో బాప‌న్ షేక్ ఇంట్లో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. మ‌ధు ఖాతూన్ గ‌ట్టిగా కేక‌లు వేయ‌డం వినిపించింది. ఆమె అరుపుల‌తో చుట్టుప‌క్క‌ల వారు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఇంట్లో నుంచి గ‌ట్టిగా ఏడుస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ మ‌ధు ముక్కు నుంచి తీవ్ర‌ర‌క్త‌స్రావం కావ‌డం వారు గ‌మ‌నించారు. 

ఆ త‌ర్వాత అస‌లేం జ‌రిగిందో తెలుసుకుని నిర్ఘాంత‌పోయారు. భ‌ర్త త‌న ముక్కును కొరుక్కుతిన్నాడ‌ని చెప్ప‌డంతో వారంద‌రూ నిశ్చేష్టులయ్యారు. ఈ దారుణంపై త‌న త‌ల్లితో క‌లిసి మ‌ధు ఖాతూన్ శాంతీపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

"అవ‌కాశం దొరికితే నా ముక్కును కొరికి తినేస్తాన‌ని భ‌ర్త అనేవాడు. చివ‌ర‌కు అన్నంత ప‌ని చేశాడు" అని మ‌ధు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ వార్త‌ నెట్టింట కూడా వైర‌ల్ కావ‌డంతో 'వీడెవడండీ బాబూ' అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.    




More Telugu News