ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మైన ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌

  • ప్ర‌ధానితో భార‌త్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ అమ‌ర్‌ప్రీత్ సింగ్‌ భేటీ
  • ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి నివాసంలో స‌మావేశం 
  • ఉగ్ర‌దాడి త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం
ప్ర‌ధాని నరేంద్ర మోదీతో భార‌త ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ అమ‌ర్‌ప్రీత్ సింగ్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్ర‌ధానమంత్రి నివాసంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ స‌మావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

ఇక‌, ఉగ్రదాడి అనంతరం దాయాది దేశాన్ని భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తున్న విష‌యం తెలిసిందే. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ వణికిపోతోంది. 

మరోవైపు, భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భార‌త్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌తో భేటీ అయ్యారు. శనివారం నాడు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మోదీ సమావేశమైన విష‌యం తెలిసిందే. 

అలాగే ఉగ్ర‌దాడి నేప‌థ్యంలోనే భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ భేటీ కూడా జరిగింది. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు త్రివిధ ద‌ళాల‌కు ఈ భేటీలో కేంద్రం పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఇక శుక్ర‌వారం నాడు యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్ విన్యాసాల‌ను నిర్వ‌హించింది.     


More Telugu News