సింహాచలం దుర్ఘ‌ట‌న‌.. బాధిత‌ కుటుంబాలను పరామర్శించిన మంత్రి నాదెండ్ల

  • సింహాచలం క్షేత్రం ఆవరణలో గోడ కూలి ఏడుగురు మృతి
  • బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రులు నాదెండ్ల‌, అనిత‌.. ఎమ్మెల్యేలు రమేష్ బాబు, నాగ మాధవి
  • బాధిత‌ కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామ‌ని మంత్రుల హామీ 
సింహాచలం క్షేత్రం ఆవరణలో గోడ కూలి గాయపడిన వారి కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, లోకం నాగ మాధవి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందిస్తామని, అండగా ఉంటామని మంత్రి నాదెండ్ల మనోహర్  భరోసా ఇచ్చారు.  

పవిత్రమైన సింహాచలంలో ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకర‌మ‌న్నారు. చ‌నిపోయిన ఏడుగురులో ఇద్దరు జనసేన క్రియాశీలక కార్యకర్తలు ఉండ‌డం పార్టీకి తీవ్ర లోటు అని పేర్కొన్నారు. వీరి మరణం వాళ్ల‌ కుటుంబాలకి తీరని లోటు అన్నారు. మృతుల‌ కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా అండగా ఉంటామని, బాధిత కుటుంబాలని ఆదుకుంటామ‌ని ధైర్యం చెప్పారు. 

అలాగే బాధితులకు జనసేన పార్టీ చీఫ్‌, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా ఉంటార‌ని మంత్రి భ‌రోసా ఇచ్చారు. ఉదయం నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని విధాల ఆదుకునేలాగా సమీక్షలు జరిపిన‌ట్లు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు.


More Telugu News