మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌పై శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • సింహాచలం ఘ‌ట‌న నేప‌థ్యంలో వైసీపీ అధికార ప్ర‌తినిధి తీవ్ర విమ‌ర్శ‌లు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైందంటూ ప్ర‌శ్నించిన శ్యామ‌ల‌ 
  • కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌రుస సంఘ‌ట‌న‌లంటూ విమ‌ర్శ‌
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘ‌ట‌న‌ తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ ఘటన నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం పీఠాధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి హైంద‌వులు విశ్వాసం కోల్పోయేలా, హైంద‌వ ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా వ‌రుస సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని శ్యామ‌ల అన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో జ‌గ‌న్‌పై  సీఎం చంద్ర‌బాబు అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసిన‌ప్ప‌టి నుంచి స్వామివారు క‌న్నెర్ర చేసిన‌ట్టు ఉంద‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాతనే వ‌రుస ఘ‌ట‌న‌లు భ‌య‌పెడుతున్నాయ‌ని అన్నారు. 

వైకుంఠ ఏకాద‌శి టికెట్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు భ‌క్తులు చ‌నిపోవ‌డం, 40 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ‌డం... టీటీడీ గోశాల‌లో వంద‌కు పైగా గోవులు మృతిచెంద‌డం, శ్రీకుడుమంలో తాబేళ్లు మృత్యువాత ప‌డ‌డం వాటిని ఈఓ కార్యాల‌యం వెనుక కాల్చివేయ‌డం ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. 

తిరుమ‌ల కొండ‌పై మందు, ఎగ్ బిర్యానీలు దొర‌క‌డం క‌ల‌క‌లం సృష్టించింద‌న్నారు. ఈరోజు సింహాచ‌లం గోడ కూలి ఏడుగురు భ‌క్తులు చ‌నిపోయార‌ని, 20 రోజుల కింద క‌ట్టిన గోడ ఎలా కూలిపోయింద‌ని శ్యామ‌ల ప్ర‌శ్నించారు. కూట‌మి నేత‌ల కాసుల క‌క్కుర్తితోనే గోడ కూలింద‌ని ఆరోపించారు. ఈరోజు కూట‌మి ప్ర‌భుత్వం నిజ‌స్వ‌రూపం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌ని విమ‌ర్శించారు. 


More Telugu News