ఇంకెంత దిగ‌జారుతారు... షాహిద్ ఆఫ్రిదిపై శిఖ‌ర్ ధావ‌న్ ఫైర్‌!

  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాద ఘ‌ట‌న నేప‌థ్యంలో కేంద్రం, భార‌త‌ ఆర్మీపై ఆఫ్రిది అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖర్ ధావన్
  • కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు.. ఇప్ప‌టికే చాలా దిగ‌జారారంటూ ఘాటు వ్యాఖ్య‌లు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాద ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వంతో పాటు ఇండియ‌న్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. భార‌త సైన్యం వైఫ‌ల్యం, చేత‌గానిత‌నం కార‌ణంగానే దాడి జ‌రిగింద‌ని అన్నాడు. అలాగే భార‌త ప్ర‌భుత్వం త‌న త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ప్ర‌తిసారి పాక్‌ను నిందించ‌డం ప‌రిపాటిగా మారింద‌ని విమ‌ర్శించాడు. 

దీంతో ఆఫ్రిది వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపాయి. ఇప్ప‌టికే ప‌లువురు అత‌ని వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఆఫ్రిదికి గ‌బ్బ‌ర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. ఇంకెంత దిగ‌జారుతారు అంటూ పాక్ మాజీ క్రికెట‌ర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తాడు. 

కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు. ఇప్ప‌టికే చాలా దిగ‌జారారు. ఇంకెంత దిగ‌జారుతారు. ఇలాంటి అర్ధ‌ర‌హిత వ్యాఖ్య‌లు చేసే బ‌దులు మీ తెలివిని దేశాన్ని అభివృద్ధి చేయ‌డానికి ఉప‌యోగిస్తే బాగుంటుంది అని ఆఫ్రిదికి ధావ‌న్ ధీటుగా బ‌దులిచ్చాడు. 

కాగా, ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆఫ్రిది, పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "భారత్‌లో చిన్న పటాకా పేలినా సరే, వారు వెంటనే పాక్‌ను నిందిస్తారు. కశ్మీర్‌లో 8 లక్షల మంది సైన్యం ఉందని గొప్పలు చెప్పుకుంటారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్నప్పుడు పర్యాటకులపై దాడి ఎలా జరిగింది? దీనర్థం మీరంతా (భారత సైన్యం) అసమర్థులని కాదా? ప్రజలకు కనీస భద్రత కల్పించడంలో కూడా మీరు విఫలమయ్యారు" అని ఆఫ్రిది విమర్శించాడు. 

ఇక‌, భార‌త ప్ర‌భుత్వం, సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అత‌నో పెద్ద జోక‌ర్ అని, ప‌నికిరాని వాడు అంటూ విమ‌ర్శించారు. ప‌నికిరాని వాళ్ల గురించి మాట్లాడడం దండ‌గ అంటూ ఆఫ్రిదిపై ఒవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


More Telugu News