పహల్గామ్ ఉగ్రదాడిపై అభ్యంతరకర పోస్టులు.. ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

  • నేహాసింగ్‌పై పిర్యాదు చేసిన ప్రతాప్‌సింగ్ అనే వ్యక్తి
  • భారత జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె పోస్టులు పెట్టారని ఆరోపణ
  • బీఎన్ఎస్ కింద పలు అభియోగాలు నమోదు
  • సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన పోలీసులు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానపద గాయని నేహాసింగ్ రాథోడ్‌పై లక్నో పోలీసులు దేశద్రోహ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అభయ్ ప్రతాప్‌సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నేహాసింగ్ తన ఎక్స్ ఖాతాలో జాతీయ సమగ్రతపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు పేర్కొన్నారు. మతం ఆధారంగా ఒక సమాజంపై మరో సమాజాన్ని రెచ్చగొట్టేలా పదేపదే ప్రయత్నించారని ఆరోపించారు. 

గాయని నేహాసింగ్‌పై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద ఆమెపై పలు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రశాంతతకు భంగం కలిగించడం, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం వంటివి ఉన్నాయి. ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  


More Telugu News