పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్ర వేట... 175 మంది అనుమానితులు అదుపులోకి!

  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్‌లో భద్రతా చర్యలు తీవ్రతరం
  • అనంతనాగ్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు, సైన్యం విస్తృత దాడులు, సోదాలు
  • విచారణ నిమిత్తం 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న బలగాలు
  • ఉగ్రవాద సహాయక నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ముమ్మర ప్రయత్నాలు
  • అదనపు చెక్ పాయింట్లు, అడవుల్లో ప్రత్యేక గాలింపు చర్యలు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని అనంతనాగ్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 175 మంది అనుమానితులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అనంతనాగ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఓ అధికారి తెలిపారు. అనుమానితుల విచారణ ద్వారా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లా అంతటా భద్రతను మరింత పటిష్టం చేశారు. అనుమానాస్పద కదలికలను పసిగట్టేందుకు, ప్రజా భద్రతకు భరోసా ఇచ్చేందుకు అదనపు మొబైల్ వెహికల్ చెక్ పాయింట్లు  ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచి, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, ఆకస్మిక దాడులు, పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి.

మంగళవారం పహల్గామ్‌ సమీపంలోని బైసరన్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 26 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని, ఉగ్రవాదంపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


More Telugu News