టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు

  • గౌతీని చంపుతామంటూ ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి రెండు మెయిల్స్‌ 
  • ఈ మేర‌కు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ
  • తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని విన‌తి
భార‌త క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్‌, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు హ‌త్య‌ బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ 'ఐసిస్‌ కశ్మీర్‌' నుంచి రెండు మెయిల్స్‌ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయ‌న‌ ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. 

గంభీర్ తక్షణ చర్య కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారని మాజీ ఎంపీ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది. ఈ నెల 22న గౌతీకు రెండు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఒకటి మంగళవారం మధ్యాహ్నం రాగా, మరొకటి అదేరోజు సాయంత్రం వచ్చింది. రెండింటిలోనూ 'ఐ కిల్‌ యూ' (IKillU) అనే సందేశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయ‌న రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన ఢిల్లీలోని రాజిందర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గంభీర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. నవంబర్ 2021లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్‌ వచ్చింది. కాగా, మంగళవారం పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని గంభీర్‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే. 

"మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు త‌ప్ప‌కుండా మూల్యం చెల్లించుకుంటారు. భార‌త్ ప్ర‌తీకార‌ దాడి చేస్తుంది" అని గంభీర్ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు. ఇక‌, ఈ దాడిలో ఇప్పటివరకు 26 మంది మ‌ర‌ణించిన‌ విషయం తెలిసిందే.




More Telugu News