పహల్గాం ఉగ్రదాడి... శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యాటకులు
- శ్రీనగర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ వాసులు
- పహల్గాం దాడి ఘటనతో భయాందోళన
- శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయిన 80 మంది
- సురక్షితంగా హైదరాబాద్ చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- సహాయం కోరుతూ పర్యాటకుల వీడియో విడుదల
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దాదాపు 80 మంది పర్యాటకులు జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. వీరిలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి జిల్లాకు చెందిన 10 మంది ఉన్నట్లు సమాచారం. మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా వీరిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా శ్రీనగర్లోని ఒక హోటల్లో బస చేస్తున్నారు.
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా వీరంతా హోటల్కే పరిమితమయ్యారు. తామున్న ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొని ఉందని, హోటల్లో చిక్కుకుపోయామని పర్యాటకులు విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. తమను వీలైనంత త్వరగా, సురక్షితంగా హైదరాబాద్కు తరలించాలని వారు కోరుతున్నారు.