Raj Kasi Reddy: రేపు సిట్ విచారణకు హాజరవుతున్నా: రాజ్ కసిరెడ్డి

- ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి
- ఇవాళ మరో ఆడియో సందేశం విడుదల
- రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సిట్ కార్యాలయానికి వస్తానని వెల్లడి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన నేడు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతానని వెల్లడించారు
అంతకుముందు, ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించడానికి నిరాకరించింది. ఆయన తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
కాగా, సిట్ అధికారులు గతంలో మూడు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాజాగా హైకోర్టులోనూ ఊరట లభించకపోవడం, కోర్టులో విచారణ ఆలస్యం అవుతుండడంతో ఆయన సిట్ ఎదుటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇదే కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన అనంతరం కూడా రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో విడుదల చేశారు. తనపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసినప్పటికీ, బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉన్నందున తాను స్పందించడం లేదని ఆ సందేశంలో పేర్కొన్నారు. త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఇప్పుడు న్యాయస్థానంలో అనుకూల నిర్ణయం రాకపోవడంతో సిట్ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.