ఉప్పల్ స్టేడియంలో స్టాండ్ కు తన పేరు తొలగింపుపై అజారుద్దీన్ స్పందన

  • ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు అజహర్ పేరు తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశం
  • అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని వెల్లడి
  • ఇది క్రికెటర్లను అగౌరవపరచడమేనని, బాధాకరమని అజహర్ ఆవేదన
  • అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తానని వెల్లడి.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పేరును తొలగించాలన్న హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశించడం తెలిసిందే. ఈ ఆదేశాలపై అజహరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఇది తనను అగౌరవపరిచే చర్య అని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని, హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.

హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే స్టాండ్‌కు ఆయన పేరు పెట్టారని, ఇది విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని అంబుడ్స్‌మన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తక్షణమే స్టాండ్ నుంచి అజహర్ పేరును తొలగించాలని, భవిష్యత్తులో మ్యాచ్‌ల టికెట్లపై కూడా ఆ పేరు ఉండకూడదని ఆయన హెచ్‌సీఏకు సూచించారు. ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"స్టేడియంలోని స్టాండ్ కు నా పేరు పెట్టుకోవడంలో కుట్ర కోణం గానీ, స్వప్రయోజనాలు గానీ ఏమీ లేవు. ఈ వివాదంపై నేను ఎక్కువగా వ్యాఖ్యానించదల్చుకోలేదు. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదు. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోంది" అని అజహరుద్దీన్ అన్నారు. 

"నేను 17 ఏళ్లు క్రికెట్ ఆడాను. దాదాపు పదేళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. కెప్టెన్‌గా డిస్టింక్షన్‌లో పాసయ్యాను. హైదరాబాద్‌లో క్రికెటర్లను ఇలాగేనా గౌరవించేది? ఇది చాలా బాధాకరం," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తప్పకుండా కోర్టుకు వెళతాం. వందశాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని అజహరుద్దీన్‌ స్పష్టం చేశారు.

గతంలో, 2019 వరకు ఈ నార్త్ స్టాండ్‌కు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ఉండేది. అయితే, ఆ తర్వాత దానిని మహ్మద్ అజహరుద్దీన్ స్టాండ్‌గా మార్చారు. ఇప్పుడు అంబుడ్స్‌మన్ ఆదేశాలతో ఈ పేరు మార్పు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల ఐపీఎల్ టికెట్ల విక్రయం విషయంలోనూ హెచ్‌సీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.


More Telugu News