బైడెన్ వల్లే జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారు: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దివంగత మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కంటే బైడెన్ పరిపాలన అధ్వానంగా ఉందని, అమెరికా చరిత్రలోనే బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని తెలుసుకుని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన పరిపాలనతో బైడెన్ పాలనను పోల్చిన ట్రంప్, "మాది దేశ చరిత్రలోనే ఆర్థికంగా అత్యంత విజయవంతమైన పరిపాలన. కానీ  బైడెన్ పరిపాలన దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. జిమ్మీ కార్టర్ కంటే అధ్వానం. అందుకే జిమ్మీ కార్టర్ సంతోషంగా మరణించారు. ఎందుకంటే, తను చెత్త అధ్యక్షుడు కాదని, ఆ స్థానం జో బైడెన్‌కు దక్కిందని ఆయనకు తెలిసింది" అని వ్యాఖ్యానించారు.

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్, తన పదవీకాలంలో ఆర్థిక సమస్యలు, ఇరాన్ బందీల సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ఇజ్రాయెల్-ఈజిప్టు మధ్య క్యాంప్ డేవిడ్ ఒప్పందం కుదర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ అనంతరం దశాబ్దాల పాటు మానవతా సేవలకు గాను ఆయన నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. జిమ్మీ కార్టర్ డిసెంబర్ 2024లో తన 100వ ఏట మరణించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల పనితీరుపై జరిగే చారిత్రక పోలికల చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి.

Donald Trump
Joe Biden
Jimmy Carter
US Politics
Presidential Comparison
White House
Oval Office
Georgia Meloni
American Politics
Trump's Remarks

More Telugu News