ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు... వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ

  • సిబ్బందికి ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ
  • కన్వేయర్ బెల్టు ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నట్లు ప్రత్యేక అధికారి వెల్లడి
  • సొరంగంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టీకరణ
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 50 రోజులు పైగా గడిచింది. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి వెంటిలేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఐదు ఎస్కలేటర్ల ద్వారా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. తవ్విన మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలిస్తున్నారు.

సొరంగం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, సహాయక బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నాయని అన్నారు. సొరంగంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

సొరంగం లోపలి నుంచి మట్టి తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. డీ-వాటరింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని అన్నారు. సహాయక బృందాల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News