అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం

  • వడగండ్ల వానతో రైతన్నకు కడగండ్లు
  • మార్కెట్లలో వరదలకు కొట్టుకుపోయిన ధాన్యం
  • పంట నష్టంపై ప్రభుత్వం సర్వే.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. చేతికి అందివచ్చిన పంట నేలపాలవుతోంది. మార్కెట్లకు తీసుకొచ్చిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన పంటను వడగళ్ల వాన దెబ్బతీసింది. ఆదివారం కురిసిన వర్షాలకు తెలంగాణలోని జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి.

గత నెల చివరి వారం నుంచి రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా దాదాపు 50 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెలాఖరు నుంచి ఈ నెల 2 వరకు కురిసిన వర్షాల కారణంగా 8 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొంది.

నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2 తర్వాత కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించి అధికారులు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. ఈ నివేదిక అందాక ఈ నెల 25న పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ నెలాఖరు వరకు వానలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు వరి కోతలను వాయిదా వేస్తున్నారు.



More Telugu News