Chandrababu Naidu: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి: సీఎం చంద్రబాబు

- నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
- ఫస్టియర్ లో 70 శాతం ఉత్తీర్ణత
- సెకండియర్ లో 83 శాతం ఉత్తీర్ణత
- ప్రభుత్వ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు
ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎంతో నిరాడంబరంగా, చెప్పిన సమయానికే ఇంటర్ ఫలితాలను వెలువరించారు. ఫస్టియర్ విద్యార్థుల్లో 70 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్ విద్యార్థుల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.
"ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఫస్టియర్ లో 47 శాతం, సెకండియర్ లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫస్టియర్ లో 11 శాతం, సెకండియర్ లో 9 శాతం పెరుగుదల నమోదైంది.
ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్రీకృత మూల్యాంకనం, పర్యవేక్షణ, నూతన సమయపాలన, 100 రోజుల సక్సెస్ కార్యక్రమం, తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, సంరక్షకుల వ్యవస్థ... ఇలా విద్యా రంగంలో మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి" అని చంద్రబాబు వివరించారు.