Chandrababu Naidu: శ్రీరాముని స్ఫూర్తితో పాలన సాగిస్తా: సీఎం చంద్రబాబు

- ఒంటిమిట్టలో వైభవంగా రాములవారి కల్యాణోత్సవం
- హాజరైన సీఎం చంద్రబాబు
- రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తానని ప్రతిజ్ఞ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన, రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, సీతారాముల కల్యాణం ఎంతో వైభవంగా జరిగిందని, వారి దాంపత్యం అందరికీ ఆదర్శమని కొనియాడారు. "పరిపాలన అంటే శ్రీరాముని పాలనలా ఉండాలి. అప్పుడే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు" అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకునే అవకాశముండేదని, విభజన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణాన్ని ప్రభుత్వపరంగా అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించామని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోకి తీసుకురావడం జరిగిందని, ఆలయ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆలయ ప్రాంగణంలోని చెరువును సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు రెండు మూడు రోజులు ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాలు మన వారసత్వ సంపదని, వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తన దృష్టిలో రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ను నిర్మించడమేనని, పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఆర్థిక అసమానతలు తగ్గించి, సుభిక్షమైన రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.