గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడండి: జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

  • గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ
  • పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతలపై టెండర్లు చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి
  • ఈ నెల 7వ తేదీన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించామని వెల్లడి
గోదావరి - బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేఖ రాసింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) కార్యాలయం జీఆర్ఎంబీకి లేఖను పంపింది.

పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఎలాంటి టెండర్లు చేపట్టకుండా చూడాలని ఆ లేఖలో తెలంగాణ కోరింది.

ఈ నెల 7వ తేదీన జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేసింది. గోదావరి-బనకచర్ల ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని జీఆర్ఎంబీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ సభ్యులు చెప్పారని గుర్తు చేసింది. అయితే మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొంది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే నిలువరించాలని తెలంగాణ కోరింది.

గోదావరి-బనకచర్ల అనుసంధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని కూడా లేఖకు జత చేసింది.


More Telugu News