ముక్కుపుడకతో వీడిన హత్య మిస్టరీ... భర్త అరెస్ట్!

Nose Ring Leads to Arrest in Delhi Murder Case
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో నెల రోజుల క్రితం సంచలనం సృష్టించిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలి ముక్కుపుడక ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు, ఆమె భర్త అనిల్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించి  అరెస్ట్ చేశారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, మార్చి 15న ఢిల్లీలోని ఓ మురుగు కాలువలో బెడ్‌షీట్‌తో చుట్టి, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి బరువు ఉండేలా రాయి, సిమెంట్ బస్తా కట్టి నీటిలో పడేశారు. కేసు విచారణకు రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలు ధరించిన ముక్కుపుడక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలి ముక్కుపుడక దక్షిణ ఢిల్లీలోని ఓ నగల దుకాణంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దుకాణంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా, ఆ ముక్కుపుడకను ఢిల్లీకి చెందిన ప్రాపర్టీ వ్యాపారి అనిల్ కుమార్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అనిల్ కుమార్ మృతురాలు తన భార్య సీమా సింగ్ (47) అని అంగీకరించాడు. ఆమె కొన్ని రోజుల క్రితం ఫోన్ లేకుండా బృందావన్ వెళ్లిందని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది.

ద్వారకాలోని అనిల్ కుమార్  కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేయగా, అతడి అత్తగారి నంబర్‌తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు లభించాయి. కుటుంబ సభ్యులను సంప్రదించగా, మార్చి 11 నుంచి సీమా సింగ్ ఎవ్వరితోనూ మాట్లాడలేదని స్పష్టం అయింది. అనిల్ కుమార్ ఆమె జైపూర్‌లో ఆరోగ్య చికిత్స తీసుకుంటోందని, అందుకే మాట్లాడటం లేదని కుటుంబాన్ని నమ్మించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఏప్రిల్ 1న కుటుంబ సభ్యులు సీమా సింగ్ మృతదేహాన్ని అధికారికంగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో అనిల్ కుమార్‌తో పాటు అతడి సెక్యూరిటీ గార్డు శివ్ శంకర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


Go Back to Shorts
Anil Kumar
Seema Singh
Delhi Murder Mystery
Delhi Crime
Murder Case Solved
Nose Ring Clue
Property Dealer
India Crime News
Delhi Police

More Telugu News