Mallu Bhatti Vikramarka: హెచ్సీయూ విద్యార్థులపై కేసులు... కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

- వర్సిటీ విద్యార్థులపై కేసుల విషయంలో భట్టి విక్రమార్క ఆదేశాలు
- కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టీకరణ
- న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచనలు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. సచివాలయంలో హెచ్సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సబ్ కమిటీ సభ్యులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
జ్యుడీషియల్ రిమాండులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.