14 దేశాలకు వీసాలు ఆపేసిన సౌదీ అరేబియా.. జాబితాలో ఇండియా, పాకిస్థాన్

  • హజ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సౌదీ కీలక నిర్ణయం
  • గత హజ్ సందర్భంగా 1,200కు పైగా మృతి
  • రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల తీవ్ర రద్దీ
హజ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర కేటగిరీ వీసాలపై ఈ నిషేధం ఉంటుంది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వస్తున్న వారిని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అధికారులు తెలిపారు.  

గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. గత ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్నవారిలో 12 వందలకు పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల హజ్ లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సౌదీ పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా నిబంధనలను కూడా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అయితే దౌత్య, నివాస ఆవాసితులు, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. సౌదీ వీసాలు ఆపేసిన దేశాల జాబితాలో భారత్ తో పాటు పాకిస్థాన్ కూడా ఉండటం గమనార్హం.

సౌదీ ప్రభుత్వం వీసాలు నిరాకరించిన దేశాలు:
ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేషియా, అల్జీరియా, జోర్డాన్, ఇరాక్, నైజీరియా, మొరాకో, సూడాన్, ట్యునీషియా, యెమెన్.

Saudi Arabia
Visa Ban
Hajj
India
Pakistan
Visa Restrictions
Travel Ban
Umrah Visa
Mohamed bin Salman
14 Countries

More Telugu News