వనౌటు పౌరసత్వాన్ని కోల్పోనున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ

  • కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు మోదీపై ఆరోపణలు
  • దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీ
  • ఇటీవలే వనౌటు పౌరసత్వం పొందిన ఐపీఎల్ మాజీ చైర్మన్
  • ఆయన గురించి అసలు విషయం తెలిశాక పాస్‌పోర్టు రద్దుకు వనౌట్ పీఎం ఆదేశాలు
పరారీలో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్టు రద్దు కానుంది. ఆయనకు ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనౌటు ప్రధానమంత్రి జోథం నపట్ సోమవారం అధికారులను ఆదేశించారు. భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకోవడానికి తమ దేశ పౌరసత్వాన్ని లలిత్ మోదీ ఉపయోగించుకుంటున్నట్టు నపట్ ఆరోపించారు.

ఇండియన్ పాస్‌పోర్టును అప్పగిస్తానంటూ లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో లలిత్ మోదీ ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఇప్పుడు వనౌటు పౌరసత్వం రద్దు కానుండటంతో ఆయన భవితవ్యం సందిగ్ధంలో పడింది.  

ఐపీఎల్ మాజీ చీఫ్ అయిన లలిత్ మోదీ తన హయాంలో కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆయన విదేశాలకు పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం దర్యాప్తు సంస్థలు వేట ప్రారంభించాయి. మోదీని భారత్‌ కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈ వార్తల నేపథ్యంలో వనౌట్ ఆయనకు ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్టును తక్షణం రద్దు చేయాలని సిటిజెన్‌షిప్ కమిషన్‌ను ఆదేశించినట్టు ప్రధాని నపట్ తెలిపారు. 


More Telugu News

Lalit Modi Vanautu Jotham Napat IPL