జైలు నుంచే వైసీపీ నేతలతో బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ జైలు నుంచే ఆ పార్టీ నేతలకు కాన్ఫరెన్స్ కాల్స్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే మధ్యంతర బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నాడని, తల్లి అనారోగ్యం పేరిట సృష్టించిన నకిలీ సర్టిఫికెట్‌కు అప్పుడే బీజం పడిందని అనుమానిస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులో అనిల్ కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై నిఘా లేకపోవడం, జైలు సిబ్బంది కూడా అతడికి సహకరించడం వల్లే ఇది సాధ్యమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జైలు నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలు వారానికి మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా వాటిని రికార్డు చేస్తారు. అవి అనుమానాస్పదంగా ఉంటే అప్రమత్తం కావాలి. కానీ, ఈ విషయంలో జైలు అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్ జైలు నుంచి ఒక నంబర్‌కు ఫోన్ చేసేవాడని, ఆయన వైసీపీ నేతలతో కాన్ఫరెన్స్ కలిపేవాడని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఎవరితో మాట్లాడేవాడు? ఏం మాట్లాడేవాడు? అన్నది తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Borugadda Anil Kumar
YSRCP
Rajamahendravaram Jail

More Telugu News