Mani Shankar Aiyar: రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాడు: మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు

- రాజీవ్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్
- రాజీవ్ గాంధీ రెండు విద్యాసంస్థల్లో పరీక్షలు తప్పాడని వెల్లడి
- అలాంటి వ్యక్తి ఎలా ప్రధానమంత్రి అయ్యాడని వ్యాఖ్యలు
- మణిశంకర్ అయ్యర్ బీజేపీ స్లీపర్ సెల్ గా పనిచేస్తున్నాడన్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో మైలేజి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇంతకీ మణిశంకర్ వ్యాఖ్యలు చేసింది ఎవరిపైనో కాదు... దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపైనే. సొంత పార్టీకిచెందిన రాజీవ్ పై మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే... "రాజీవ్ గాంధీ మొదట్లో ఓ పైలట్. కానీ ఆయన చదువుకునే రోజుల్లో రెండు సార్లు పరీక్షలు తప్పారు. రాజీవ్ తో కలిసి నేను కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాను. కేంబ్రిడ్జ్ లో ఆయన ఫెయిల్ అయ్యారు. విచిత్రమైన విషయం ఏమిటంటే... కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాస్ అవడం చాలా తేలిక. ఎందుకంటే, కేంబ్రిడ్జ్ వర్సిటీకి ఎంతో గొప్ప పేరుంది. ఫెయిలైన వాళ్లు ఎక్కువ మంది ఉంటే విద్యాసంస్థకు చెడ్డపేరు వస్తుందని, అక్కడ ప్రతి ఒక్కరినీ పాస్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి చోట కూడా రాజీవ్ గాంధీ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత లండన్ లోని ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజిలో చేరాడు. అక్కడ కూడా ఫెయిల్! అందుకే నాకనిపిస్తుంటుంది... ఇటువంటి వ్యక్తి ఎలా ప్రధానమంత్రి కాగలిగాడు?" అంటూ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు.
ఇదే అదనుగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దాంతో... కాంగ్రెస్ నేతలు విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మణిశంకర్ అయ్యర్ నిరాశతో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... మణిశంకర్ అయ్యర్ బీజేపీకి 'స్లీపర్ సెల్' గా పనిచేస్తున్నారని ఆరోపించారు.