Nara Lokesh: వర్సిటీల్లో ఖాళీలు వాస్తవమే... ఈ ఏడాదే భర్తీ చేస్తాం: మండలిలో నారా లోకేశ్

Nara Lokesh replies to a query on AP Universities
విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. 

"ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే పరిశ్రమ నిపుణులతో ప్రాక్టీషనర్స్ పాఠాలు చెబితే బాగుంటుందని భావిస్తున్నాం. అక్రిడేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ కూడా చాలా అవసరం. అది కూడా తీసుకువస్తున్నాం. ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్, కెపాసిటీ బిల్డింగ్, వారికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ విజిట్ వంటివన్నీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. డిజిటల్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ చేస్తాం. 

బడ్జెట్ లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు రూ.2వేల కోట్లు కేటాయించడం జరిగింది. మౌలికవసతులు, పరిశోదనల కోసం ఆ నిధులను ఖర్చుపెడతాం. కేంద్ర కూడా అనేక కార్యక్రమాల కింద విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తోంది. వాటిని జతపరచి కార్యక్రమాలు చేపడతాం. 

విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కూడా కోర్టులో ఉంది. దీనిపై ఏజీతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం. 

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ లో ఏపీ 9వ స్థానంలో ఉంది. 3 వ స్థానానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్యూఎస్ ర్యాంకింగ్ లో టాప్-100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని అన్నారు.
Nara Lokesh
AP Legislative Council
TDP-JanaSena-BJP Alliance

More Telugu News