ఎస్ఎల్‌బీసీ సొరంగంలో బురద తీయడం సవాలే అంటున్న నిపుణులు

  • 11వ కిలోమీటర్ నుండి 13.50 కిలోమీటర్ వరకు బురద
  • 11.50 కిలోమీటర్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన రక్షణ సిబ్బంది
  • కన్వేయర్ బెల్టుతో బురదను తొలగించాలని భావిస్తున్న సహాయక సిబ్బంది
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో బురద పరిస్థితిని జీఎస్ఐ, ఎన్జీఆర్ఎఫ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బురదను బయటకు తీయడం సవాలేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ సొరంగంలో చాలా మేరకు బురద పేరుకున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు. బురదతో పాటు అధిక నీరు సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది.

11వ కిలోమీటర్ నుండి 13.50 కిలోమీటర్ వరకు బురద పేరుకుపోయి ఉందని గుర్తించారు. వివిధ ఏజెన్సీలకు చెందిన రక్షణ బృందాలు 11.50 కిలోమీటరు వరకు వెళ్లి వెనక్కి వచ్చాయి. సొరంగం 13.50 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది. 11.50 కిలోమీటర్ నుండి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ ధ్వంసమైనట్లుగా గుర్తించారు.

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద ఉందని నిపుణలు గుర్తించారు. అలాగే, సొరంగంలో 3,600 నుండి 5,000 లీటర్ల మేర నీటి ఊట ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బురదను బయటకు తీయడం సవాలుగా మారినప్పటికీ, కన్వేయర్ బెల్టుతో బయటకు తీయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు చేస్తున్నారు. రేపు సాయంత్రానికి మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కన్వెయర్ బెల్టుతో గంటకు 800 టన్నుల బురదను బయటకు తోడే అవకాశం ఉంది.


More Telugu News