మంగళగిరిలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

mangalagiri gold theft case solved
  • బంగారు అభరణాలను కొట్టేసి చోరీ డ్రామా 
  • స్నేహితులతో కలిసి జ్యూయిలరీ షాపు గుమాస్తా నాగరాజు పన్నాగం
  • సీసీ టీవీ పుటేజీతో చోరీ డ్రామా వెలుగులోకి
  • నిందితులను అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం 
  • మీడియాకు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
5 కేజీల బంగారం చోరీ కేసును మంగళగిరి పోలీసులు ఆరు రోజుల వ్యవధిలో ఛేదించి, నిందితులను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు దుకాణంలో పనిచేసే గుమాస్తా ద్విచక్ర వాహనంపై బంగారం తీసుకువెళుతుండగా చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినీ ఫక్కీలో జరిగిన ఈ బంగారం చోరీ వ్యవహారాన్ని ఛేదించేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

విజయవాడలో డివిఆర్ జ్యుయలర్స్ షాపు యజమాని రాము తన దుకాణంలో తయారుచేసిన బంగారు ఆభరణాలను నల్గొండ, సూర్యాపేట, నకరేకల్లు ప్రాంతాల్లోని పలు దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను ఒక బ్యాగులో భద్రపరిచి, షాపులో పనిచేసే నాగరాజుకు అప్పగించి మంగళగిరిలోని తన ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలని పంపించాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాల బ్యాగ్ దొంగతనానికి గురైందని యజమాని రాముకు నాగరాజు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.

ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లినట్లు నాగరాజు తెలిపాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా నాగరాజు వద్ద నుంచి దుండగులు బంగారం వస్తువులు ఉన్న బ్యాగ్‌ను తీసుకువెళుతుండగా అతను ప్రతిఘటించలేదు. దీంతో పోలీసులకు నాగరాజుపై అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

గతంలో జ్యూయిలరీ షాపులో పనిచేసి మానేసిన కొందరు స్నేహితులతో కలిసి నాగరాజు ఈ చోరీకి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నాగరాజుకు సహకరించిన భరత్, నవీన్, ఇర్ఫాన్, మోహన్, లోకేష్, చందు, అరుణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను నిందితులు టైర్లలో దాచి పెట్టారని, కొంత బంగారాన్ని కరిగించారని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. 
Go Back to Shorts
Mangalagiri
Gold Theft Case
Guntur District

More Telugu News