తుంగభద్ర నదిలో హైదరాబాద్ యువ వైద్యురాలి గల్లంతు

  • స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లిన అనన్యరావు
  • తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నీటి ఉద్ధృతికి గల్లంతు
  • గజ ఈతగాళ్లు, అగ్నిమాపకశాఖ గాలించినా కనిపించని జాడ
స్నేహితులతో కలిసి సరదాగా హంపి పర్యటనకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో గల్లంతయ్యారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా, తుంగభద్ర డ్యామ్ సమీపంలో జరిగిందీ ఘటన. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న మైనంపల్లి అనన్యరావు (26) తన ముగ్గురు స్నేహితులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం సణాపురలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. నిన్న ఉదయం తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన అనన్య ఓ పెద్ద రాయిపై నుంచి దూకారు. అయితే, నీటి ఉద్ధృతి కారణంగా ఆమె కొట్టుకుపోయారు. 

ఈత కోసం నీటిలో దూకడానికి ముందు అనన్య రెడీ అవుతున్న వీడియో వైరల్ అవుతోంది. వన్.. టూ.. త్రీ అంటూ స్నేహితులు కౌంట్ డౌన్ చేయడం కూడా వీడియోలో వినిపిస్తోంది. నదిలో దూకిన తర్వాత పైకి తేలుతూ కాసేపు ఈతకొట్టారు. ఆ తర్వాత గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.

ఆమె గల్లంతైన ప్రదేశంలో తుంగభద్ర నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉండటంతో వైద్యురాలు ఆ గుహల్లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక గజ ఈతగాళ్లతోపాటు అగ్నిమాపక దళం నిన్న సాయంత్రం వరకు గాలించినా యువతి జాడను గుర్తించలేకపోయారు. గాలింపు చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సాయం కోరనున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News