YSRCP Office: వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు

Police issues notices to YSRCP office
షార్ట్స్‌లో చూడండి
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వరుసగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్నిప్రమాదాలపై 6వ తేదీన పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని అందజేయాలని వైసీపీ కార్యాలయానికి 7వ తేదీన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయలేదని, అందువల్ల ఫుటేజీ అందుబాటులో లేదని పోలీసులకు వైసీపీ కార్యాలయ వర్గాలు లేఖను ఇచ్చాయి. 

ఈ క్రమంలో వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించిన రోజున కార్యాలయానికి వచ్చిన నేతలు, సందర్శకుల జాబితాను ఇవ్వాలని, కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనాల నంబర్లు, వాహనదారుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతోపాటు, సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను అందజేయాలని కోరారు. మరోసారి నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కేంద్ర కార్యాలయం ఈరోజు స్పందించే అవకాశం ఉంది. 

ఈ నెల 5వ తేదీన వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్న ఎండిపోయిన గడ్డికి మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అదే రోజున మళ్లీ మంటలు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
YSRCP Office
Fire Accident

More Telugu News