Peddireddi Ramachandra Reddy: ఆ భూమిని 2001లోనే కొనుగోలు చేశాం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy fires on AP govt and media
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. 

చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని... చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించి గతంలో ఫారెస్ట్ గెజిట్ కూడా విడుదలైందని, ఇది పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుందని, ఎవరైనా చూసుకోవచ్చని అన్నారు. 

ఇక రోడ్డు విషయానికి వస్తే... గతంలో అది బండ్లు పోయేందుకు వీలుగా ఉందని, అయితే దాన్ని పక్కా రోడ్డుగా మార్చేందుకు తాము దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఆ రోడ్డు వేస్తే ఇతర రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో అటవీశాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని పెద్దిరెడ్డి వివరించారు. తారు రోడ్డు వేసుకోవచ్చని 2022లో అనుమతి వచ్చిందని వెల్లడించారు. 

కానీ, మీడియాలోని ఓ వర్గం దీన్ని కూడా అభూతకల్పనలతో రాసిందని ఆరోపించారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు, 20 సార్లు చంద్రబాబు ఏవిధంగా అయితే చెబుతారో, ఈ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా కూడా అదే విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 

గతంలోనూ ఇలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకున్నామని, చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థపై రూ.50 కోట్లకు... ఈనాడు, ఈటీవీపై ఒక రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేశామని వివరించారు. ఇప్పుడు భూ ఆక్రమణలు అంటూ తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై కూడా పరువునష్టం దావా వేస్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. 
"కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టారని వార్తలు రాశారు. 2001 లోనే అక్కడ పని చేసే వారికోసం మేము గెస్ట్ హౌస్ కట్టాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆరోజు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదు అని తేల్చి చెప్పింది. 

ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు కూడా ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారు. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. 1968లో ఇచిన ఫారెస్ట్ గెజిట్ లో కూడా ఆ 76 ఎకరాలు వారికి సంబంధం లేదు అని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు

చంద్రబాబు తానా అంటే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తందానా అంటాడు. ఇక్కడేదో జరిగిపోయింది... మొత్తం దోచేశాడు... దీనిపై ఎంక్వైరీ వేస్తాం... తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పాడు. ఇదే పెద్దమనిషి ఎన్నికల సమయంలో నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. పెద్దిరెడ్డి ఇసుకలో రూ.40 వేల కోట్లు దోపిడీ చేశాడు అని చెప్పాడు. నేను ఒక్క రూపాయి అయినా దోచుకుని ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? 

ఇదే పెద్దమనిషి నేను ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా ఉన్నానని ఆరోపణలు చేశాడు. ఆ స్మగ్లింగ్ చేసిన ఎర్రచందనం అంతా నేపాల్ లో పట్టుబడింది... మేం అధికారంలోకి వస్తే విచారణ చేపడతాం అని చెప్పాడు ఇదే పవన్ కల్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రివి అయ్యావు... ఉప ముఖ్యమంత్రివి అయ్యావు... మరి నేపాల్ కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఉంటే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాను. 

ఏమీ లేకుండానే... వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలి" అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Go Back to Shorts
Peddireddi Ramachandra Reddy
Land Encroachment
YSRCP
Chandrababu
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News