అదే జ‌రిగి ఉంటుంది.. అందుకే విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేశారు: హోంమంత్రి అనిత సెటైర్లు

  • విజయసాయికి గొడ్డలి కలలోకి వచ్చిందేమోన‌న్న మంత్రి అనిత‌ 
  • అందుకే భ‌య‌ప‌డి రాజీనామా చేశారంటూ సెటైర్లు
  • అయితే, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనన్న మంత్రి
విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆయ‌న‌కి గొడ్డలి కలలోకి వచ్చిందేమో.. అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని సెటైర్లు వేశారు. అయితే, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనని అని తెలిపారు.

కాగా, ఈరోజు విశాఖ జువైనల్ హోమ్‌ను సంద‌ర్శించిన‌ మంత్రి అనిత.. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. దీన్ని ఎవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై ఆమె తీవ్ర విమర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. గత ఐదేళ్లు అబద్ధాలతో గడిపేశారని.. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. 

ఇక దావోస్‌ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌... రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదని వైసీపీ నేత‌లు చేస్తున్న విమర్శలపై కూడా అనిత స్పందించారు. గత ఐదేళ్లలో దావోస్‌లో నాలుగుసార్లు సమ్మిట్‌ జరిగితే ఒక్కసారి మాత్రమే వెళ్లొచ్చారని మాజీ సీఎం జగన్‌ను విమర్శించారు. 

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తుంద‌ని, పెట్టుబడులు రావడం లేదంటూ మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలపైనా అనిత ఘాటుగా స్పందించారు. ఒక‌వేళ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తే.. వైసీపీ వాళ్లు ఈ 7 నెలల్లో రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. 


More Telugu News