Padi Kaushik Reddy-Sanjay: మంత్రుల సమీక్షలో రచ్చ... ఎమెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాభాస అయింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు. 

నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?... అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి... సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. 

దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకెళ్లారు.
Padi Kaushik Reddy-Sanjay
Ministers Review
Karimnagar Collectorate
Congress
BRS

More Telugu News