హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో కారు డ్రైవర్ పరార్!

Car Driver Escaped With 7 Kg Gold Worth Rs 6 Cr
  • చిల్లకల్లు సమీపంలో టీ తాగేందుకు ఆగగా కారుతో డ్రైవర్ పరార్
  • నందిగామ అడ్డరోడ్డులో కారును వదిలేసి వెళ్లిన నిందితుడు
  • విజయవాడ బయలుదేరడానికి ముందే హైదరాబాద్‌లో ఇల్లు ఖాళీ
  • పక్కా ప్రణాళికతోనే చోరీ చేసినట్టు పోలీసుల గుర్తింపు
విజయవాడలో డెలివరీ చేయాల్సిన 6 కోట్ల రూపాయల విలువైన 7 కేజీల బంగారు నగలతో ఓ కారు డ్రైవర్ పరారయ్యాడు. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన శ్యాంబాబా జువెల్లర్స్ యజమాని 7 కేజీల బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ చేయాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన జితేంద్ర కారులో తన ఇద్దరు సొంత మనుషులతో వాటిని డెలివరీ కోసం పంపించారు. 

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలో టీ తాగేందుకు కారు ఆపారు. ఈ క్రమంలో మిగతా ఇద్దరికీ తెలియకుండా డ్రైవర్ జితేంద్ర కారుతో  పరారయ్యాడు. అనంతరం నందిగామ మండలం అడ్డరోడ్డులోని ఓ గోడౌన్ వద్ద కారు వదిలేసి అందులోని ఆభరణాలతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విషయం తెలిసిన నగల వ్యాపారి హైదరాబాద్‌లోని నిందితుడి ఇంటికి వెళ్లగా అతడు ఇల్లు ఖాళీ చేసినట్టు తెలిసింది. దీంతో పక్కా ప్రణాళికతోనే ఈ చోరీకి పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Crime News
Hyderabad
Vijayawada
Gold
Jewellery

More Telugu News