అధికారులను తిట్టి చంద్రబాబు సాధించిందేముంది?: అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యం వల్లే తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారులను తిట్టి తన పనైపోయిందని చంద్రబాబు భావిస్తున్నారని... అధికారులపై కోపం చూపించి ఆయన సాధించింది ఏముందని ప్రశ్నించారు. నిర్లక్ష్యం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవిస్తాయని అన్నారు. 

పవిత్రమైన ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అంబటి చెప్పారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం ఇదని అన్నారు. టీటీడీ ఈవో, జేఈవోలే ఈ ప్రమాదానికి కారణమని... వారికి టీటీడీకి సేవ చేయాలన్న దృక్పథం కన్నా టీడీపీకి సేవ చేయాలనే తపన ఎక్కువని చెప్పారు. గతంలో జగన్ తిరుమలకు వస్తానంటే పెద్దపెద్ద బోర్డులు పెట్టారని మండిపడ్డారు. 

సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంతవరకు ఏం మాట్లాడలేదని సెటైర్లు వేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటేనే మృతుల ఆత్మలు శాంతిస్తాయని చెప్పారు.

Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News