మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీర్మానం

  • మద్దతు తెలిపిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ
  • దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి
  • భారతరత్న అవార్డుకు పూర్తి అర్హులన్న మాజీ మంత్రి కేటీఆర్
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల కన్నుమూసిన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. 

మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు.

దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని, వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఎనలేని సేవలు అందించారని రేవంత్ గుర్తుచేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారని చెప్పారు. దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

విపక్షనేత, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారానికి మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులు అని పేర్కొన్నారు.


More Telugu News

Manmohan Singh Telangana Assembly Session Revanth Reddy KTR BRS Congress