Rahul Gandhi: నెహ్రూ లేఖలను తిరిగిచ్చేయండి.. రాహుల్ గాంధీకి ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ లేఖ

Prime Ministers Museum written to Rahul Gandhi requesting return of personal letters written by Jawaharlal Nehru
  • చారిత్రక నేపథ్యం ఉన్న లేఖలను తిరిగి పొందేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి
  • 2008లో సోనియా గాంధీ ఈ లేఖలను తీసుకున్నారన్న ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ 
  • ఐన్‌స్టీన్‌తో పాటు పలువురు ప్రముఖులకు, నెహ్రుకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని వెల్లడి
భారతదేశ తొలి ప్రధానమంత్రి జనహర్‌లాల్ నెహ్రు రాసిన వ్యక్తిగత లేఖలను సోనియా గాంధీ తీసుకున్నారని, వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్)’ అధికారికంగా లేఖ రాసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2008లో సోనియా ఈ లేఖలను తీసుకున్నారని పేర్కొంది. 

సెప్టెంబరులో సోనియా గాంధీకి ఇదే విషయమై ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ఒక లేఖ రాసింది. తాజాగా డిసెంబర్ 10న రాహుల్ గాంధీకి లేఖ రాయడం గమనార్హం. లేఖలను అసలు రూపంలో తిరిగి ఇచ్చినా లేదా డిజిటల్ కాపీల రూపంలో అందించినా ఫర్వాలేదని పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ కద్రీ కోరారు.

అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ లేఖలను 1971లో మ్యూజియానికి అప్పగించారు. అయితే, 2008లో వాటిని 51 పెట్టెల్లో ప్యాక్ చేసి సోనియా గాంధీకి పంపినట్లు తెలుస్తోంది. 

కాగా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మౌంట్ బాటన్, పద్మజా నాయుడు, జయప్రకాశ్ నారాయణ్, అరుణ అసఫ్ అలీ, విజయ లక్ష్మీ పండిట్, బాబూ జగ్జీవన్ రామ్, గోవింద్ బల్లబ్ పంత్‌ వంటి ప్రముఖులకు, జవహర్ లాల్ నెహ్రుకు మధ్య జరిగిన ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు చారిత్రక ప్రాముఖ్యత కలిగివున్నాయని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం పేర్కొంది. ఈ లేఖలను తిరిగి పొందడంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సాయం చేయాలని రిజ్వాన్ కద్రీ కోరుతున్నారు.
Rahul Gandhi
Congress
Sonia Gandhi
Viral News

More Telugu News