Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఈ విగ్రహావిష్కరణకు అందరూ రావాలంటూ సభాముఖంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై వివరణ ఇచ్చారు. విగ్రహం నమూనా మార్పుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభలో నిర్ణయించారు. అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Telangana
Telangana Assembly Session
Congress
BRS

More Telugu News