రైతుబంధును శాశ్వతంగా బంద్ చేసే కుట్ర జరుగుతోంది: హరీశ్ రావు
- రైతుబంధు కంటే రూ. 500 బోనసే మేలని మంత్రి చెబుతున్నారని హరీశ్ మండిపాటు
- రైతుబంధును ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని వ్యాఖ్య
- రైతుబంధు అమలుపై రేవంత్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధును బంద్ చేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే హెచ్చరించారని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగానే రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. రైతుబంధును తొలగించే కుట్రను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతుబంధు అమలుపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వానాకాలం రైతుబంధుతో పాటు... యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని అన్నారు.