28 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి 28 రూపాయలు కూడా తీసుకు రాలేదు: కేటీఆర్
- సీఎం పెళ్ళికి వెళ్తున్నారో... ఏమో కానీ తెలంగాణకు ఏమీ తీసుకు రాలేదని విమర్శ
- నిధులు తీసుకు రాకపోతే ప్రశ్నించడం తమ బాధ్యత అని వ్యాఖ్య
- మేం ఢిల్లీ నేతలకు గులాం గిరీ చేయడం లేదన్న కేటీఆర్
తాను ఢిల్లీలో దాక్కున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్ లో చీకట్లో కాళ్లు పట్టుకున్నది ఎవరో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. మీ బడే బాయ్... చోటే మియాల వ్యవహారం అందరికీ తెలుసునన్నారు.
పోరాటం బీఆర్ఎస్ రక్తంలోనే ఉందని, తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ అన్నారు. వారిలా తాము ఢిల్లీ నేతలకు గులాం గిరీ చేయమన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమది అయితే, పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఓటుకు నోటులో దొరికిన చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.