Love Crime: ప్రేమ పేరిట యువకుడి వేధింపులు.. భువనగిరిలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Degree student committed suicide after youth harassment
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక డిగ్రీ చదువుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భువనగిరిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ ఎలగందుల సతీశ్‌కుమార్, సంధ్య దంపతుల కుమార్తె హాసిని (19) సికింద్రాబాద్‌లోని కస్తూర్బా మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. భువనగిరిలోని రాంనగర్‌కు చెందిన నిఖిల్ ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా ఆమెను వేధిస్తున్నాడు. హైదరాబాద్‌లోనే ఉండే నిఖిల్ అప్పుడప్పుడు భువనగిరి వచ్చి వెళ్తుండేవాడు. కాలేజీకి సెలవు కావడంతో హాసిని రెండ్రోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

ఆదివారం హాసిని ఫోన్‌కు నిఖిల్ అసభ్యకరంగా సందేశాలు పంపడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న హాసిని మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాసిని, నిఖిల్ భువనగిరిలోని ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారని, అప్పటి నుంచే తమ కుమార్తెను వేధిస్తున్నాడని, హాసిని చావుకు కారణమైన నిఖిల్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Love Crime
Yadadri Bhuvanagiri District
Crime News

More Telugu News