ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ తనవైపు చూసేలా చేసిన అర్జున్ టెండూల్కర్

  • రంజీ ట్రోఫీలో తొలిసారి 5 వికెట్ల ఫీట్ సాధించిన సచిన్ తనయుడు
  • అరుణాచల్ ప్రదేశ్‌‌ను 84 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర
  • గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని రోజుల్లోనే జరగనుంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిర్వహించనున్నారు. ఈ మెగా ఆక్షన్‌కు ముందు తనపై అంచనాలను పెంచుతూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పేసర్... అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు.

ఆట మొదటి రోజున ప్రత్యర్థిని 84 పరుగులకే ఆలౌట్ చేయడంలో అర్జున్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీశాడు. గోవా బౌలర్లు మోహిత్ 3, కీత్ పింటో 2 వికెట్లతో తమవంతు సహకారం అందించడంతో అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 30.3 ఓవర్లలోనే ముగిసింది.

రంజీ ట్రోఫీకి ముందు జరిగిన డాక్టర్ కే.తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో కూడా అర్జున్ టెండూల్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతిథ్య కర్ణాటకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు. దీంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన ప్రదర్శనను మెరుగుపరచుకున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అర్జున్ టెండూల్కర్‌ను రిటెయిన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అందుబాటులో ఉండనున్న అతడిపై ఫ్రాంచైజీలు కన్నేసే సూచనలు ఉన్నాయి.

Arjun Tendulkar
Sachin Tendulkar
Cricket
Sports News
IPL Mega Auction

More Telugu News