ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఏమన్నారంటే..?

AndhraPradesh Minister On Super Six Promices
  • మహిళా శిశు సంక్షేమానికి 4 వేల కోట్ల నిధుల కేటాయించిన ప్రభుత్వం
  • తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్న మంత్రి
  • పేదరికంతో రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దని వ్యాఖ్య
  • దీపం పథకంతో ఏటా మూడు సిలిండర్లు.. 5 లక్షల మందికి లబ్ది
మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సాధికారతపై దృష్టి సారించారని మంత్రి పయ్యావల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి, వివిధ శాఖల కేటాయింపులపై ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.4,285 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.

పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా, దీపం–2 పథకం ద్వారా గృహిణులకు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులు లబ్ది పొందుతున్నారని అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Talliki Vandanam
AP Budget
Payyavula Keshav
AP Assembly Session
Andhra Pradesh

More Telugu News